
మెంతులు మనం తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లు అలాగే షుగర్ను పీల్చుకునే వేగాన్ని తగ్గిస్తాయి, దీని వలన షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి
మెంతి గింజలు లేదా మెంతులను సాధారణంగా అనేక భారతీయ వంటకాలలో సువాసన లేదా పోపు దినుసుగా ఉపయోగిస్తారు. ఎండు గింజల రుచిని కలిగి ఉండే సాధారణ దినుసులో ఫైబర్ మరియు ఐరన్ అలాగే మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో మెంతి గింజలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
తన 84 ఏళ్ళ మామగారు వీటిని రోజు తీసుకోవడం వలన పొందే ప్రయోజనాలను చూసి తను కూడా ప్రతీ రోజు మెంతులు తీసుకోవడం ప్రారంభించాను అని కేరళకు చెందిన సునిలా శంకర్ చెప్పారు.
“మధుమేహం ఉన్న మా మావయ్య, తన షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండేలా పండ్లను తినే రోజుల్లో మెంతి గింజలను తప్పక తీసుకునే వారు. అతను ఇతర రోజులలో కఠినమైన డయాబెటిస్ డైట్కి కట్టుబడి ఉంటారు,”ఆమె వివరిస్తుంది.
మెంతి గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను అనుభవించాలనుకునే శంకర్ – వాటిని తినడం వల్ల తన తెల్లవారుజామున ఆకలి బాధలను అరికట్టడంలో సహాయపడిందని భావించారు. “ఇది నన్ను నియంత్రణ లేకుండా తినడం నుండి కాపాడింది. నా బరువు మరియు లిపిడ్ ప్రొఫైల్ను నిర్వహించడంలో నాకు సహాయపడింది” అని ఆమె పేర్కొన్నారు.
మెంతులు అలాగే రక్తంలోని చక్కెర స్థాయుల మధ్య సంబంధం
బెంగుళూరులోని బన్నెరఘట్ట రోడ్లోని ఫోర్టిస్ హాస్పిటల్, ఎండోక్రినాలజీ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ అనూషా నాడిగ్ మాట్లాడుతూ మెంతిలోని విశిష్టమైన పోషక మరియు ఔషధ గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం ద్వారా మధుమేహం నిర్వహణలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. “ దీని విత్తనాలలో ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్ శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది,” ఆమె వివరించారు.
జర్నల్ ఆఫ్ డయాబెటిస్ & మెటబాలిక్ డిజార్డర్స్లో ప్రచురించబడిన ఒక పరిశోధనా కథనం ప్రకారం, ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో రోజుకు 10 గ్రాముల మెంతికూరను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా డయాబెటిస్గా మారడం తగ్గుతుంది.
డయాబెటిస్ నిర్వహణ కోసం మెంతి గింజలను తీసుకునే వ్యక్తులు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్పైక్లను తగ్గడాన్ని గమనిస్తారని డాక్టర్ నాడిగ్ చెప్పారు. “మీ రక్తంలో చక్కెర స్థాయిలు వాటికి ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది,” ఆమె చెప్పారు.
బెంగళూరుకు చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ అశ్విత శృతి దాస్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం ఆమెను సంప్రదించే వ్యక్తులు తరచుగా చెప్తూ ఉంటారు అని చెప్పారు. అయినప్పటికీ, ఆమె ఇన్సులిన్ లేదా ఇతర మందులకు బదులుగా మెంతికూరను సిఫారసు చేయదు.
బెంగుళూరులోని Aster RV Hospital చీఫ్ న్యూట్రిషనిస్ట్ సౌమితా బిశ్వాస్ మాట్లాడుతూ, ఈ చిన్న చేదు-రుచి గల విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడటమే కాకుండా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న ఫ్లేవనాయిడ్లను కలిగి ఉన్నందున ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి అని చెప్పారు.
“ఇందులో ఉన్న పీచు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది” అని చెప్పారు.
పాలిచ్చే తల్లులకు, మెంతులు, రాగి పిండి అలాగే గౌర్ గమ్ (గింజలను నుండి చేసే పొడి)ని కలిపి లడ్డూలుగా చేసి తినిపించడం వల్ల మెంతుల ప్రయోజనాలు వారికి అందుతాయి. “ఇది మంచి గెలాక్టోగాగ్లా పనిచేస్తుంది (చనుబాలను పెంచం ఆహారం), ఇది పోషకాల భరితం అలాగే ఆరోగ్యకరం” అని వివరించారు బిశ్వాసమ.
మెంతిలోని పోషక విలువలు
బిశ్వాస్ చెప్పిన దాని ప్రకారం, 100 గ్రాముల మెంతులలో 323 కిలో క్యాలరీ, 58 శాతం కార్బోహైడ్రేట్లు అలాగే 23 శాతం ప్రోటీన్ ఉంటుంది.
100 గ్రాముల మెంతులలో 25 గ్రాముల వరకు పీచు పదార్థం ఉంటుంది అని డాక్టర్ నాడిగ్ అన్నారు. వీటితో పాటు, దీనిలో (విటమిన్ A, k అలాగే C) విటమిన్లు, (ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియమ్, జింక్ మరియు కాల్షియం) వంటి ఖనిజాలు ఉన్నాయి.
“రోజుకు ఒక స్పూన్ మెంతులు సురక్షితమైన డోస్” అని చెప్పారు బిశ్వాస్.
మెంతులు తీసుకోవడం: జాగ్రత్తలు
మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించగలిగినప్పటికీ, ఇది కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుంది. కొంతమందికి మెంతులు వలన జీర్ణ సమస్యలు వస్తాయి, కాబట్టి ఇది మీకు సరిపోతుందో లేదో అర్థం చేసుకోవడానికి ఎల్లప్పుడూ చిన్న మోతాదుతో ప్రారంభించడం మంచిది.
రక్తం పల్చబడే మందులు వాడే వారు (వార్ఫారిన్ వంటివి) లేదా యాంటీప్లేట్లెట్ మందులు వేసుకునే వారు వీటిని తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ మందులతో ప్రతికూల చర్యల కారణంగా ఇబ్బందులకు దారి తీయవచ్చు.
మెంతి గింజలను గర్భిణీ స్త్రీలు తినకూడదని డాక్టర్ నాడిగ్ హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే అవి ముందస్తు ప్రసవానికి కారణమవుతాయి. అదనంగా, మధుమేహం ఉన్నవారు మరియు తల్లిపాలు ఇస్తున్న మహిళలు వాటిని తీసుకునే ముందు వారి వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి. మధుమేహం ఉన్నవారు వీటిని అధికంగా తీసుకోవడం వల్ల హైపోగ్లైసీమియా వస్తుంది.
మెంతుల వలన అలర్జీలు కూడా రావచ్చు. జీర్ణాశయ సమస్యలు ఉన్న వారికి ఇవి పడకపోతే తీసుకోవడం మానెయ్యాలి.
మెంతులు తీసుకునే మార్గాలు
మెలకలు వచ్చిన మెంతులను కూరలు లేదా సలాడ్ అలాగే సూప్లలో ఉపయోగించవచ్చు.
“విత్తనాలను రాత్రిపూట నానబెట్టడం వలన వాటి చేదును తగ్గించడానికి మరియు ఉదయం తినడానికి వాటిని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది” అని డాక్టర్ నాడిగ్ వివరించారు. విత్తనాలను నానబెట్టడం పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుందని బిస్వాస్ అన్నారు. మెంతులను వాటితో టీ కాచుకోవడం ద్వారా కూడా తీసుకోవచ్చు.
అదనంగా, విత్తనాలను సుగంధ ద్రవ్యాలు మరియు తాజా కొబ్బరితో కలపడం ద్వారా చట్నీని తయారు చేయవచ్చు. మెంతి గింజలను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు లేదా కొన్ని బియ్యం తయారీలతో కూడా జత చేయవచ్చు. అయితే, వాటిని మితంగా తీసుకోవాలి. “మీరు పండ్లు మరియు కూరగాయలతో కూడిన సలాడ్లపై మెంతి పొడిని చల్లుకోవచ్చు” అని డాక్టర్ నాడిగ్ సూచిస్తున్నారు.
కీలక అంశాలు
- ఆహారంలో మెంతి గింజలు లేదా మెంతులను తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా జరిగి కార్బోహైడ్రేట్లు మరియు షుగర్ పీల్చుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది, కాబ్టటి డయాబెటిస్ నియంత్రణలో ఇది ఉపయోగపడుతుంది.
- మెంతులను తీసుకునేటప్పుడు రక్తంలోని చక్కెర స్థాయులను చూసుకోవడం మంచిది లేదంటే హైపోగ్లైసిమియాకు దారి తీయవచ్చు.
- మెంతులను కూరలు, సలాడ్లు అలాగే సూప్లలో ఉపయోగించవచ్చు. వీటిని నీటిలో నానబెట్టి, పొడి చేసి లేదా టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.