కొత్త తరం ఆయుర్వేద పరికరాలు శారీరక అసమతౌల్యాన్ని అంచనా వేసి, మీ శ్రేయస్సుకు అవసరమైన సమగ్ర, విస్తృత సిఫారసుల జాబితాను సిద్ధం చేస్తాయి.
మానవ వనరుల వృత్తి నిపుణుడు మురళీ కృష్ణన్కు ఇప్పుడు 38 ఏళ్లు. బాల్యం నుంచే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటంవల్ల అనారోగ్యం ముప్పు ఎక్కువే ఆయనకు. ఈ నేపథ్యంలో నాడీ పరీక్ష గురించి సహోద్యోగి ద్వారా తెలుసుకుని, ఆ విధానాన్ని ఓ సారి ప్రయత్నించే ఉద్దేశంతో ముంబైలోని ఆయుర్వేద వైద్యుని వద్దకు వెళ్లారు.
కృష్ణన్ నాడి స్పందనను తెలుసుకోవడం కోసం వైద్యుడు ఆయన కుడి మణికట్టు మీద మూడు వేళ్లను ఉంచి పరీక్షించారు. ఆ తర్వాత కిందిభాగంలో మూడు గణుపులు గల బహుళ–వేలిముద్రల స్కానర్ వంటి పరికరాన్ని చేతిలోకి తీసుకున్నారు.
“నా ఎడమ ముంజేతిని బల్లపై ఉంచగా, వైద్యుడు తన చేతిలోని సెన్సార్ పరికరాన్ని 15 నిమిషాలపాటు నా మణికట్టు మీద ఉంచి పరీక్షించారు. ఆ తర్వాత నా శరీర తత్వం గురించి వివరిస్తూ ఆహారం, జీవనశైలిపరంగా చేసుకోవాల్సిన మార్పులను సూచించారు” అని కృష్ణన్ ‘హ్యాపీయెస్ట్ హెల్త్’తో చెప్పారు. అలాగే రోగనిరోధక వ్యవస్థ సమతూకానికి తోడ్పడగల, వ్యక్తిగత అవసరాలకు తగిన ఆహార ప్రణాళిక జాబితాను అందజేశారు.
శారీరక, మానసిక, భావోద్వేగ అసమతౌల్యాల నిర్ధారణ కోసం ఆయుర్వేద వైద్యులు కొన్ని శతాబ్దాలుగా నాడీ పరీక్ష (స్పందన ద్వారా నిర్ధారణ)ను ఉపయోగిస్తున్నారు. అయితే, వారిప్పుడు తమ విశ్లేషణ కోసం ఈ సెన్సార్ పరికరాలను వాడుతున్నారు. సాధారణంగా సుదీర్ఘ అనుభవం, అధ్యయనంతో మాత్రమే నాడీ స్పందనను విశ్లేషించగల నైపుణ్యం అలవడుతుంది. అయితే, రోగనిర్ధారణలో మెరుగైన ఫలితాలివ్వడంలో ఇలాంటి పరికరాలు నేడు యువ ఆయుర్వేద వైద్యులకు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
మణికట్టు కీలు ప్రాంతంలో బొటనవేలు మూలం కలిసేచోట కనిపించే స్పందన నాడి వేగాన్ని కొలవడం ద్వారా ఈ పరికరం పనిచేస్తుంది. తరంగ రూపంలో ధమనుల నుంచి వెలువడే ఒత్తిడి ఆధారంగా ఆయుర్వేద వైద్యులు పరిగణనలోకి తీసుకునే 22 పరామితులను ఈ పరికరాలు కొలవగలవు. వీటిలో ప్రధానమైన మూడు (వాత, పిత్త, కఫ) దోషాల నుంచి అగ్ని (జఠరాగ్ని), ఒత్తిడి వరకూ ప్రతి కొలతనూ ఇవి నమోదు చేస్తాయి.
అన్నిరకాల శరీర విధులను, స్థితిగతులను మూడు మూల శక్తులు- వాతం (వాయువు), పిత్తం (అగ్ని), కఫం (జలం) నిర్దేశిస్తాయన్నది ఆయుర్వేద వైద్య విధానంలో కీలక సూత్రం. ఆయుర్వేద వైద్యులు సంప్రదాయకంగా ఒక వ్యక్తి నాడీ స్పందన అనుభూతిని బట్టి ఈ శక్తులను గుర్తించారు. నాడి కదలిక, వేగం, లయ, బలం, నాణ్యతను ఆధారంగా వ్యక్తి ఆరోగ్య-అనారోగ్యాలనే కాకుండా దానికి కారణాలను కూడా అంచనా వేస్తారు.
ఈ నేపథ్యంలో సెన్సార్ –ఆధారిత పరికరాలు ఆయుర్వేద వైద్యులకు వినూత్న కొలమాన సామర్థ్యాన్ని సమకూర్చాయి. దీనివల్ల వేళ్లతో కేవలం రక్తప్రవాహ వేగం అనుభూతి ద్వారా రకరకాల పారామితులను అంచనా వేసే శ్రమ వారికి తప్పింది.
మెషిన్ లెర్నింగ్ (ML), కృత్రిమ మేధస్సు (AI) అందుబాటులోకి రావడంతో ఈ పరికరాలకు మరింత కచ్చితత్వం వచ్చింది. “ఈ పరికరాలకు ఇప్పుడున్నంత కచ్చితత్వం లోగడ ఉండేది కాదు. ఇటీవలి కాలంలో ‘AI, ML’ సాంకేతికతల ముందంజతో ఇవి చాలా ఆధునికతను సంతరించుకున్నాయి. సాధారణ నాడీ పరీక్ష ద్వారా లభించే ఫలితాలతో సమానంగా.. కొన్ని సందర్భాల్లో ఇంకా మెరుగైన ఫలితాలతో యువ ఆయుర్వేద వైద్యులకు ఎంతగానో తోడ్పడుతున్నాయి” అని ముంబైలోని ‘నాడీ గురు పల్స్ డయాగ్నసిస్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్’ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ సంజయ్ ఛజెడ్ చెప్పారు.
ఈ పరికరాల వాడకంపై ఆయుర్వేద వైద్యులలో ఆసక్తి పెరడంతో “నాడీ తరంగిణి, వేద పల్స్, నాడీ స్వర, ఆయురిథం” సహా రకరకాల పేర్లతో అనేక నాడీ స్పందన కొలిచే సెన్సార్ పరికరాలు నేడు మార్కెట్లోకి వచ్చాయి.
అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల తరహాలో తమ పరికరాలు 87 శాతం కచ్చితత్వం చూపుతాయని ‘నాడీ తరంగిణి’ సంస్థ చెబుతోంది. దీనిగురించి సంస్థ సూత్రధారి, ఆత్రేయ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపక సీఈవో అనిరుద్ధ జోషి మాట్లాడుతూ- “ఐదు వేల ఏళ్లనాటి ప్రాచీన నాడీ నిర్ధారణ విజ్ఞానానికి సెన్సార్ ఆధారిత వస్తు వ్యవస్థ రూపమివ్వడంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం” అని చెప్పారు.
అయితే, “అనుభూతి” ద్వారా గ్రహించే సమాచారాన్ని ‘ఎంఎల్’ సాయంతో నియమాధారిత డేటా అల్గారిథమ్గా మార్చడానికి ఆయుర్వేద వైద్యులు, సమాచార విశ్లేషణ ఇంజనీర్లు, అగ్రశ్రేణి మేధో నిపుణులతో కూడిన బృందం సమష్టిగా శ్రమించిందని ఆయన తెలిపారు.
ఇప్పటివరకూ 500 పరికరాలు విక్రయించామని, తమవద్ద 1.95 లక్షల మంది వినియోగదారుల సమాచార నిధి ఉందని జోషి చెప్పారు. తమ ‘ఎంఎల్’ వ్యవస్థలు సంప్రదాయ వైద్యులతో సమానంగా పరికరం కచ్చితత్వాన్ని నిరంతరం మెరుగుపరుస్తూనే ఉంటాయన్నారు.
వ్యక్తిగతీకరించిన ఆహార, జీవనశైలి మార్పులు సూచించే మూడు పేజీల చార్టును ఈ పరికరం వినియోగదారులకు అందిస్తుంది. నిర్దిష్ట యోగా భంగిమలు, నిద్ర వేళల పట్టిక, సంగీత సూచనలు (మీ స్వభావానికి తగిన రాగం), వ్యాయామం, రోజువారీ తీసుకోవాల్సిన నీటి పరిమాణం వంటి ప్రతి అంశాన్నీ వివరించే 7 లేదా 15 రోజుల కార్యక్రమం కూడా అందులో ఉంటుంది. అంతేగాక సంప్రదాయ నాడీ నిర్ధారణలో సాధారణంగా నమోదుచేసే 22 పరామితులతో కూడిన మరింత వివరణాత్మక నివేదికను ఈ పరికరం వైద్యులకు అందిస్తుంది.
నిపుణులతో ఒకసారి ‘నాడీ’ సంప్రదింపులకు రూ.500 నుంచి 1500 ఖర్చవుతుంది.
బెంగుళూరులోని శ్రీ తులసి ఆయుర్వేదాలయ ప్రధాన వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీహర్ష కె.వి. కూడా ఈ నాడీ పర్యవేక్షణ పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఎప్పుడు.. ఏం చేయాలో లేదా చేయకూడదో చెప్పే చార్ట్ రూపకల్పన కోసం తన వద్దకు వచ్చేవారికి ఈ పరికరం సాయపడుతుందని ఆయన చెప్పారు. వంటగదిలో ఈ చార్టును ఉంచుకుని, ఆహార తయారీలో దాన్ని అనుసరించాల్సిందిగా తనను సంప్రదించే వ్యక్తులకు ఆయన సలహా ఇస్తారు. అయితే, “ఈ పరికరం ద్వారా అంతర్గత అవయవ సంబంధిత సమాచారం మాత్రం లభించదు” అని ఆయన స్పష్టం చేశారు.
విశ్లేషణ నివేదిక, వ్యక్తి నివాస స్థలం ఆధారంగా 7-15 రోజుల కార్యక్రమాల కోసం సమాచార నిధి నుంచి జీవనశైలి దిద్దుబాటు ప్రణాళిక పకడ్బందీగా ఎంపిక చేయబడుతుంది. అందులో రోజువారీ తీసుకోవాల్సిన నీటి పరిమాణం సహా వ్యక్తిగత ఆహార, యోగా, నిద్ర, సంగీత, వ్యాయామ పద్ధతులు ఈ పరికరం ద్వారా సూచించబడతాయి. మరోవైపు వైద్యులకు వివరణాత్మక నివేదిక అందుతుంది.
అయితే, వైద్యుడి చేతి స్పర్శను మించినదేదీ లేదని కొందరు భావించడం సహజం.
“వైద్యులు సదా స్వయంగా నాడీ పరీక్ష చేయాలని, తర్వాత వివరణాత్మక నివేదిక కోసం పరికరాన్ని వాడితే బాగుంటుందని నా సూచన. సంప్రదాయ పద్ధతిలో నాడి పట్టుకుని పరీక్షిస్తే రోగికి ఎంతో సౌకర్యవంతమైన అనుభూతి కలుగుతుంది. అదే పని యంత్రం చేసినపుడు సంతృప్తి స్థాయి కేవలం వారి ఆలోచనకే పరిమితం” అని డాక్టర్ ఛజెడ్ చెప్పారు.
వైద్య సంరక్షణ రంగంలో మరింత కచ్చితత్వంతో రోగ నిర్ధారణకు ‘AI’ మార్గం సుగమం చేసిన నేపథ్యంలో దీన్నుంచి ప్రయోజనం పొందడానికి ఆయుర్వేదం కూడా సిద్ధమైంది. నాడీ నిర్ధారణ పరీక్ష ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రత్యక్ష వ్యక్తిగత అంచనాలు అవసరం. అయితే, కేవలం నాలుక ఫొటోతో రోగ నిర్ధారణ చేయగల భవిష్యత్తరం పరీక్ష విధానం రావచ్చునని తన తదుపరి ప్రాజెక్టుగా దీనిపై ప్రయోగాలు చేస్తున్న జోషి చెబుతున్నారు. “వైద్య రంగంలో కొత్త సమాచార నిధి, నమూనాలు, నిబంధనలు, విజ్ఞానం, ఆవిష్కరణ వగైరాలతో కూడిన నిరంతర ప్రక్రియ సదా కొనసాగుతూనే ఉంటుంది” అని ఆయన ముగించారు.