బెంగళూరుకు చెందిన ఏడేళ్ల బాలికకు మెడపై పెద్ద వాపు ఏర్పడింది. ఏడాదికిపైగా బాలిక ఆ బాధను భరించింది. రోజులు గడుస్తున్నా ఈ బాధకు తోడు ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రిలోని సర్జికల్ ఆంకాలజీ, రోబోటిక్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ నాయక్.. బాలికకు చికిత్స అందించి థైరాయిడ్ గ్రంధులలో క్యాన్సర్ ఉందని గుర్తించారు. 2018లో డాక్టర్ నాయక్ అభివృద్ధి చేసిన రోబోటిక్ సర్జరీ సాయంతో ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని పొందింది. దీంతో ఆధునిక టెక్నాలజీతో తనకు ప్రాణం పోసిన డాక్టర్ నాయక్కు ఆ బాలిక కృతజ్ణతలు తెలిపారు.
ఇదే విషయంపై డాక్టర్ నాయక్ హ్యాపియస్ట్ హెల్త్తో మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన బాలిక కుటుంబం రోగాన్ని నిర్ధారించే క్రమంలో అనేక నగరాల్లోని వివిధ ఆస్పత్రులకు వెళ్లారు. ఈ క్రమంలోనే బాలికను మా ఆస్పత్రికి తీసుకురావడంతో అల్ట్రాసౌండ్ – గైడెడ్ టెస్ట్, బయాప్సీ టెస్ట్ చేశాం. ఈ పరీక్షల్లో బాలికకు థైరాయిడ్ క్యాన్సర్లో ఒక రకమైన పాపిల్లరీ కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
థైరాయిడ్ క్యాన్సర్ కారణంగా ఆమె మెడ భాగంలోని శోషరస గ్రంథుల్లో వాపు ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనిని భారతదేశంలో పీడియాట్రిక్ థైరాయిడ్ శస్త్రచికిత్సలలో మొదటి కేసుగా గుర్తించాము. దీంతో బాలికకు శస్త్రచికిత్స కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి వచ్చిందని డాక్టర్ నాయక్ చెప్పారు.
డాక్టర్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం రోబోటిక్ అసిస్టెడ్ బ్రెస్ట్ – యాక్సిలో ఇన్సఫ్లేషన్ థైరాయిడెక్టమీ (RABIT) మరియు బైలేటరల్ నెక్ డిసెక్షన్ ప్రక్రియ ద్వారా 2023 అక్టోబర్లో బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ప్రక్రియలో థైరాయిడ్ గ్రంధిని తొలగించడానికి చిన్న కోతలతో పాటు రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ కేసును చాలా ప్రత్యేకంగా పిలుస్తారు.
ఈ రకమైన శస్త్రచికిత్సలకు సాధారణంగా శరీరంపై పెద్ద కోత అవసరం ఉంటుంది. మెడ ముందు భాగంలో 15 నుంచి 20 సెం.మీ మేర U-ఆకారపు గాయం చేయడంతో పాటు తప్పనిసరిగా ఓపెన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పిల్లలకు వారి జీవిత కాలమంతా మెడ ముందుభాగంలో పెద్ద మచ్చ ఉంటుంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక ప్రత్యేకమైన కేసు అని ఆయన చెప్పారు.
అయితే RABIT విధానంలో 0.8- 2సెంటీమీటర్ల పొడవు మేర మాత్రమే గాయం అవుతుంది. ఓపెన్ థైరాయిడెక్టమీ సర్జరీ చేయడం వల్ల మెడ ప్రాంతంలో 15 సెంటీమీటర్ల పొడవు మచ్చ ఏర్పడి వికారంగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా రోగి యొక్క విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. నొప్పిని కూడా కలుగజేస్తుందని తెలిపారు.
యుక్తవయసులో ఉన్న వారికి నిర్వహించే థైరాయిడ్ శస్త్రచికిత్స కంటే ఈ ప్రక్రియ పెద్దగా భిన్నంగా లేకపోయినప్పటికీ.. పెద్దవారితో పోలిస్తే చిన్న పిల్లల్లో శరీర భాగాలు చిన్నవిగా ఉన్నందున వారు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ నాయక్ చెప్పారు.
రోబోటిక్ సర్జరీల విషయానికి వస్తే ఇది సాంప్రదాయ ఓపెన్ సర్జరీలా కాకుండా ఇక్కడ ప్రతి నిర్మాణం పెద్దదిగా ఉంటుంది. దీంతో మేము రోబోటిక్ సర్జరీతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం అని ఆయన చెప్పారు.
RABIT టెక్నిక్ సాయంతో మరింత సులభంగా..
డాక్టర్ నాయక్ అధునాతన రోబోటిక్ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ.. ‘ఈ పద్ధతి ద్వారా శరీరంపై పెద్దపెద్ద కత్తి గాట్లు లేకుండా చిన్న కోతలతోనే థైరాయిడ్ను తొలగించవచ్చు. ఓపెన్ థైరాయిడెక్టమీతో పోల్చినపుడు ఇక్కడ శస్త్రచికిత్స నాణ్యత, పేషంట్లు కోలుకోవడం మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ శస్త్రచికిత్స మెరుగైన ఫలితాలను కూడా ఇస్తుంది’ అని చెప్పారు.
డాక్టర్ నాయక్ సాంకేతికత గురించి మరింతగా వివరిస్తూ.. దేశ వ్యాప్తంగా చాలా మంది అనుసరించే సాంప్రదాయ శస్త్రచికిత్స పద్ధతులు మెడ వెనుక పెద్ద గాయాన్ని చేస్తాయి. అంత పెద్ద గాయంతో మెడకు శస్త్రచికిత్సలు చేయడంపై మొదట్లో నాకు నమ్మకం కలగలేదు. ఆ తర్వాత దీని గురించి ఆలోచించాను. అయితే అప్పట్లో నేను కూడా చాలా లాప్రోస్కోపిక్ థైరాయిడ్ సర్జరీలు చేసేవాడిని. అనంతరం వాటిని సవరిస్తూ.. రోబోటిక్ సర్జరీలు చేయడం ప్రారంభించాను.
మొత్తంగా మేము చేస్తున్న ఓపెన్ సర్జరీలతో పోలిస్తే RABIT సాంకేతికత సాయంతో ఫలితాలు మరింత మెరుగ్గా ఉన్నాయని నేను భావించాను. ఈ విధంగా అధునాతన శస్త్రచికిత్స ప్రక్రియ ప్రారంభమైందని డాక్టర్ నాయక్ చెప్పారు. అంతేకాకుండా ఇవాళ నేను చేసే థైరాయిడ్ సర్జరీలు చాలా వరకు రోబోటిక్యేనని ఆయన పేర్కొన్నారు.
కేవలం రెండు రోజుల్లోనే..
చికిత్స అనంతరం బాలికను కేవలం రెండు రోజుల్లోనే చిన్నపిల్లల అత్యవసర చికిత్స విభాగం నుంచి జనరల్ వార్డ్కు మార్చారు. వెంటనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. సర్జరీ సమయంలో పీడియాట్రిక్ విభాగాలు మాకు ఎంతగానో సాయపడ్డాయని ఈ సందర్భంగా డాక్టర్ నాయక్ చెప్పారు.
”మేము చిన్నపిల్లల వైద్యులం కాదు.. పీడియాట్రిక్ సర్జన్లు అసలే కాదు. కాబట్టి బాలికకు శస్త్రచికిత్స సమయంలో సంబంధిత విభాగాల సాయం తీసుకోవాల్సి వచ్చింది” అని డాక్టర్ నాయక్ తెలిపారు.
యధాప్రకారంగా పాఠశాలకు..
ప్రస్తుతం ఆ అమ్మాయి గతంలో మాదిరిగానే తన జీవితాన్ని గడుపుతోంది. పాఠశాలకు కూడా వెళ్తోంది. థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా క్రమంగా రేడియో యాక్టివ్ థెరపీ అందిస్తున్నారు. తన తోటి వయస్సు వారిలాగే తనూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
దీర్ఘకాలంలో థైరాయిడ్ క్యాన్సర్లను మనం రోగనిర్ధారణ చేయవచ్చు. ప్రస్తుతం మనం మాట్లాడుతున్న బాలికకు కూడా మెడ భాగంలో వాపు ఎక్కువగా ఉండేది. అయితే దీర్ఘకాలంలో ఈ వ్యాధి నుంచి బయటపడతానన్న నమ్మకం తనలో బలంగా ఉంది. అదే ఇప్పుడు తనని బతికిస్తోందని డాక్టర్ నాయక్ తెలిపారు.