థైరాయిడ్ .. ఇదొక దీర్ఘకాలిక సమస్య. మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇది ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ అనేది ఓ గ్రంథి. గొంతు భాగంలో ఉండే ఈ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ వల్ల శరీరంలోని ప్రతి అవయవం ప్రభావితమవుతుంది. మన శరీర అవసరాలకు అనుగుణంగా థైరాయిడ్ గ్రంథి రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. అవే T3, T4. వీటి ఇవి శరీరానికి సరిపోతున్నాయా లేకుంటే వీటి అవసరం ఇంకా ఎక్కువ ఉందా అని గమనిస్తూ… అందుకు తగ్గట్టుగా థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే హార్మోను మరోటి మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో విడుదల అవుతుంది. దీన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ – TSH అంటారు. ఈ హార్మోన్ ఉత్పత్తిలో అసమతుల్యత వల్ల సమస్య ఏర్పడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఈ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే హైపో థైరాయిడ్ సమస్య బారిన పడతారు. అలా కాకుండా హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే ఏర్పడే సమస్యను హైపర్ థైరాయిడ్ అంటారు. సాధారణంగా చాలా మందిలో హైపో థైరాయిడ్ సమస్యనే అధికంగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యను సకాలంలో గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
ఎలా తెలుసుకోవచ్చు?
ఎవరికైనా నీరసంగా ఉండటం, మలబద్ధకం, చర్మంతో పాటు వెంట్రుకలు పొడిబారటం, ఎక్కువ నిద్ర, బరువు పెరగటం, స్త్రీలలో అయితే నెలసరిలో రక్తస్రావం ఎక్కువ లేదా తక్కువ అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేకపోవడం, గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవటం, జుట్టు రాలటం తదితర లక్షణాలు కనిపిస్తే అది హైపో థైరాయిడ్ సమస్యగా గుర్తించాలి. అలా కాకుండా ఆకలి అధికంగా వేయటం, బరువు అమాంతం తగ్గిపోవటం, చెమటలు పట్టటం, చిరాకు కల్గడం, స్థిమితంగా ఉండలేకపోవడం, నిద్రలేమి, నీరసం, ఎక్కువ సార్లు విరేచనాలు కావటం, వేడిని తట్టుకోలేకపోవడం, గొంతు ముందు వాపు రావటం, గుండె దడగా అనిపించటం, కళ్లు పెద్దవిగా కావటం, చేతులు వణకటం వంటి లక్షణాలు కనిపిస్తే అది హైపర్ థైరాయిడ్ అని గుర్తించాలి. తక్షణమే సరైన పరీక్షలు చేయించుకుని మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఒక సారి థైరాయిడ్ సమస్య వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనని ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నగేష్ చెప్పారు.
మందులు వాడకుండా థైరాయిడ్ ను నియంత్రించవచ్చా?
ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యను కంట్రోల్ లో ఉంచవచ్చని కొన్ని అధ్యయనాలు, ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఒక సర్వే ప్రకారం మన దేశంలో 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ తో బాధపడుతున్నారు. కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద డాక్టర్ దీక్షా భావ్సార్ తెలిపారు. ఈ ఆహారం హైపో, హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్న వారందరికీ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుచుకోవాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు ఎంతో సహాయపడతాయి.
ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి?
థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్న వారు ఆహారంలో ఉసిరిని భాగంగా చేసుకోవటం ఎంతో మేలని డైటీషియన్లు చెబుతున్నారు. ఉసిరి కాయలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. నారింజ కన్నా 8 రెట్లు, దానిమ్మ పండు కన్నా 17 రెట్లు సీ విటమిన్ ఉసిరికాయలో ఉంటుంది. హైపర్ థైరాయిడ్ ఉన్న వారు ఉసిరి తింటే హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. నేరుగా ఉసిరిని తినలేని వారు ఉడకబెట్టి అయినా తినొచ్చు. పచ్చడి చేసుకొని తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో ఉసిరిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. బ్రిజిలియన్ బీటెల్ నట్స్ తినటం వల్ల కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచవచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఈ నట్స్ తినటం వల్ల శరీరానికి సెలీనియం లభిస్తుంది. బ్రెజిలియన్ బీటెల్ నట్స్ లో సెలీనియం సమృద్ధిగా లభిస్తుంది. రోజుకు మూడు నట్స్ తింటే చాలు థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుందని ప్రయోగాలు నిరూపించాయి. గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తినటం వల్ల కూడా థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చు. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తుంది. జింక్ శరీరం ఇతర విటమిన్లను, మినరల్స్ ను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, నియంత్రణలో జింక్ అద్భుతంగా పనిచేస్తుంది.
పచ్చికొబ్బరి లేదా కొబ్బరి నూనె థైరాయిడ్ రోగులకు ఉత్తమ ఆహారంగా వైద్య నిపుణులు సూచిస్తారు. ఇది జీవక్రియను మెరుగు పరుస్తుంది. కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్స్ , ట్రైగ్లిజరైడ్స్ సమృద్ధిగా ఉంటాయి. జీవక్రియను మెరుగుపర్చటంలో ఇవి విశేషంగా పనిచేస్తాయని నిరూపితమైంది. అలాగే పెసర్లు తినటం థైరాయిడ్ రోగులకు అత్యవసరం. ఎందుకంటే థైరాయిడ్ మంచిగా పనిచేయాలంటే అయోడిన్ చాలా అవసరం. పెసర్లలో అయోడిన్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ తో పాటు అయోడిన్ కూడా పెసర్లలో లభిస్తుంది. థైరాయిడ్ బాధితులకు పెసర్లు సూపర్ ఫుడ్ అని వైద్యనిపుణులు చెబుతారు. ఇవేగాక శనగలు, ఆకు కూరలు, బెర్రీలు, ఆవుపాటు, మజ్జిగ తీసుకున్నా మంచిదని న్యూట్రీషియనిస్ట్ లహరి సూరపనేని తెలిపారు.
మందులు వాడితే థైరాయిడ్ అదుపులో ఉంటుందా?
మందులు వాడుతున్నా హైపో థైరాయిడ్ కొన్నిసార్లు అదుపులో ఉండదు. అందుకు చాలా కారణాలున్నాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా హైపో థైరాయిడ్ బాధితులు ట్యాబ్లెట్ వేసుకోవాలి. మధ్యలో కొన్ని రోజులు మానేస్తే TSH స్థాయి మీద ప్రభావం పడుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్నాక అరగంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోరాదు. పాలు, టీ, కాఫీ లాంటివి కూడా తీసుకోరాదు. ఒక వేళ తీసుకున్నట్లయితే టాబ్లెట్ ప్రభావం సంపూర్ణంగా ఉండదు. థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ కాబట్టి దీని కోసం వాడే టాబ్లెట్ ను చేతితో కూడా తాకరాదు. అలా చేస్తే మందు ప్రభావం తగ్గిపోతుంది. తడిచేతితో అస్సలు తాకరాదు. అలాగే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇతర టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా దాని ప్రభావం తగ్గిపోయే అవకాశముంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వేసుకునే అసిడిటీ టాబ్లెట్ , ఐరన్ టాబ్లెట్ల వల్ల కూడా థైరాయిడ్ టాబ్లెట్ పనితీరు మందగిస్తుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే థైరాయిడ్ టాబ్లెట్లకు ఎండ తగలరాదు. అలా జరిగితే వాటి ప్రభావం తగ్గిపోతుందని ప్రముఖ వైద్య నిపుణురాలు ప్రతిభ పేర్కొంటున్నారు.