హైడ్రోథెరపీ లేదా వాటర్ థెరపీ అనేది వివిధ పరిస్థితులకు చికిత్స చేయడం కోసం వేడి లేదా చల్లటి నీటిని ఉపయోగించే ఒక పద్ధతి.
బెంగుళూరుకు చెందిన 41 ఏళ్ల రమ్య బి.బి తనకు గడచిన రెండేళ్లుగా సమస్యగా మారిన కీళ్ల నొప్పి కోసం వైద్యుడిని సంప్రదించారు. వైద్య చరిత్ర ప్రకారం, ఆమెకు స్థూలకాయం, గ్యాస్ట్రైటిస్ మరియు మైగ్రేన్ ఉన్నాయి. మోనోపాజ్ అనేది ఆమె కీళ్ల నొప్పికి కారణం కావచ్చునని డాక్టర్ ఆమెకు చెప్పారు. నొప్పి తగ్గించడం కోసం ఆమెకు ఔషధాలు సూచించారు. అయితే, అది దీర్ఘకాలిక పరిష్కారం కాదు.
ఆ తర్వాత, ఆమె ఒక నేచురోపాత్ను కలిశారు. ఆమె వైద్య చరిత్రను మరియు ఆమె జీవనశైలి ఎంపికలను అర్థం చేసుకోవడం ద్వారా, ఆ ప్రకృతి వైద్యుడు ఆమెకు రెండు వారాల పాటు ఆవాలు ప్యాక్లు, కోల్డ్ కంప్రెషర్లు మరియు ‘రివల్సివ్ థెరపీ’ సూచించారు.
ఆమెకు డైట్ ప్లాన్ కూడా ఇచ్చారు మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందిగా సూచించారు. చికిత్సను అమలు చేయడంతో పాటు, సిఫార్సు చేసిన జీవనశైలి మార్పులు కొనసాగించిన తర్వాత, ఆమె తన కీళ్ల నొప్పులు, గ్యాస్ ట్రబుల్ మరియు మైగ్రేన్ సమస్యల నుండి ఉపశమనం పొందగలిగారు. అంతేకాకుండా, ఆమె బరువు కూడా తగ్గారు.
ప్రకృతివైద్యంలో హైడ్రోథెరపీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ పరిస్థితులు నిర్వహించడం కోసం నీటిని వివిధ రూపాల్లో (వేడి మరియు చల్లని) చికిత్సాపరంగా ఉపయోగించడాన్నే హైడ్రోథెరపీ లేదా వాటర్ థెరపీ అంటారు.
హైడ్రోథెరపీ చికిత్సా ప్రణాళిక అనేది వ్యక్తి ఎత్తు, బరువు మరియు బలం మీద ఆధారపడి ఉంటుంది. చాలావరకు ఈ చికిత్సా పద్ధతులనేవి చర్మం మీద వేడి లేదా చల్లటి నీళ్లు పోయడమనే రూపంలోనే ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి చర్మ ప్రతిస్పందనను పరిశీలించడం ద్వారా, ఆ వ్యక్తికి సరిపోయే కంప్రెషన్, ప్యాక్లు లేదా స్నానాల రకాలను వైద్యులు సూచిస్తారు.
“చర్మంలోని ఒక చిన్న ప్రదేశంలో వేడి మరియు చల్లటి ఉద్దీపన కలిగించినప్పుడు, కందిపోవడం మరియు పాలిపోవడమనే రూపంలో, చర్మం దాని రంగు మార్చడం ద్వారా ప్రతిస్పందిస్తుందని కర్నాటకలోని ఉజిరేలో ఉండే శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ నేచురల్ థెరప్యూటిక్స్ విభాగం డీన్ డాక్టర్ సుజాత కె జె చెప్పారు. ఉద్దీపనకు చర్మం ప్రతిస్పందన సుదీర్ఘంగా ఉంటే, అలాంటప్పుడు ఆవిరి స్నానాలు లేదా ఎక్కువ వేడితో ఉండే కంప్రెషన్లను నివారించడం మంచిది. అయితే, మృతకణాలు తొలగించడానికి మరియు హైడ్రోథెరపీకి ముందు చర్మ ప్రతిస్పందన మెరుగుపరచడానికి ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్)ను చర్మం మీద రుద్దవచ్చు.
కంప్రెషన్ థెరపీ
“ఆర్థరైటిస్కు సంబంధించిన ప్రకృతివైద్య చికిత్సల్లో హైడ్రోథెరపీ, ఇన్ఫ్రారెడ్ థెరపీ, మసాజ్ థెరపీ మరియు ఫాస్టింగ్ థెరపీ లాంటివి ఉంటాయి. హైడ్రోథెరపీలో ఆవాలు ప్యాక్లు మరియు వేడి, వెచ్చని లేదా చల్లటి కంప్రెషర్లు ఉంటాయి” అని డాక్టర్ సుజాత చెప్పారు.
ఆవాల పొడి, బియ్యపు పిండి మరియు వేడి నీటి మిశ్రమాన్ని చర్మం మీద పూయడాన్నే ఆవాలు ప్యాక్ అంటారు. ఒకానొక అధ్యయనం ప్రకారం, ఇది చికాకు కలిగించేలా పనిచేయడం ద్వారా, కీళ్ల దగ్గర రక్త ప్రవాహం పెంచుతుంది. ఇది మెదడు ప్రతిస్పందనను ప్రేరేపించడం ద్వారా, చివరకు కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది.
ఈ ప్యాక్ను 12 నుండి 15 నిమిషాల తర్వాత తీసివేయాలి; లేకపోతే, అది కాల్చినట్లుగా ఉండే గాయాలకు దారి తీస్తుంది. కొందరిలో కొద్దిసేపట్లోనే ఈ కాలిపోయిన గాయాల భావన కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో, ఆ ప్యాక్ను వెంటనే తీసివేయాలి. ఈ చికిత్స మూడు నుంచి ఏడు రోజులు కొనసాగుతుందని డాక్టర్ సుజాత చెప్పారు.
“ప్రారంభ చికిత్స తర్వాత, ఆ వ్యక్తి ఇంట్లోనే కంప్రెషర్ థెరపీలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఎందుకంటే, వీటిని సులభంగా నిర్వహించవచ్చు. వేడి లేదా చల్లటి కంప్రెషన్ మీద ఆధారపడి, వస్త్రాన్ని వరుసగా వేడి లేదా చల్లటి నీటిలో నానబెట్టి, కీలు మీద కట్టులాగా వేస్తారు. సాధారణంగా, వేడి కంప్రెషన్ను నాలుగు నిమిషాలు అందిస్తారు. ఆ తర్వాత ఒక నిమిషం పాటు కోల్డ్ కంప్రెషన్ ఇస్తారు. అయితే, దీర్ఘకాలిక పరిస్థితుల కోసం, వేడి కంప్రెషన్ అనేది ఎనిమిది నిమిషాలు సూచించబడుతుంది. ఆ తర్వాత, రెండు నిమిషాలు కోల్డ్ కంప్రెషన్ అందిస్తారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు నొప్పి నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది” అని డాక్టర్ సుజాత చెప్పారు.
కాంట్రాస్ట్ బాత్ థెరపీ
ఆరు నుండి ఏడు సెషన్లలో, ప్రత్యామ్నాయ క్రమంలో దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు వేడి మరియు చల్లటి నీటి స్నానాలు చేయిస్తారు. కీళ్ల కోసం శస్త్రచికిత్స చేయించుకున్న వృద్ధులు ఈ కాంట్రాస్ట్ బాత్ థెరపీ నుండి ప్రయోజనం పొందవచ్చునని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉండే ఆరోగ్యమ్ నేచురోపతి సెంటర్కు చెందిన ప్రకృతి వైద్యురాలు డాక్టర్ నేహా పటేల్ చెప్పారు. ఆపరేషన్ చేయించుకున్న 15 రోజుల తర్వాత, ప్రకృతి వైద్యుడి పర్యవేక్షణలో ఇది చేయించుకోవచ్చు.
ఆవిరి స్నానం
ఆవిరి స్నానం సమయంలో వ్యక్తిని ఒక చాంబర్ లోపల ఉంచుతారు. ఆ వ్యక్తి తల మాత్రమే బయట ఉంచి, ఎనిమిది నుండి పది నిమిషాలు ఆ చాంబర్లోకి ఆవిరి పంపిన తర్వాత, చల్లటి నీటితో స్నానం చేయిస్తారు.
అలెర్జిక్ రినిటిస్ (అలెర్జీ కారణంగా ముక్కు కారడం) విషయంలో ఆవిరి పీల్చడమనేది ఉపశమనం అందిస్తుంది. అయితే, సువాసన తైలాలు ఉపయోగించకపోవడమే ఉత్తమం. ఎందుకంటే, ఇవి కళ్లకు చికాకు కలిగించవచ్చు అని డాక్టర్ సుజాత చెప్పారు.
ప్యాక్లు
ప్రకృతివైద్య వైద్యుల ప్రకారం, అలెర్జీ రినైటిస్ ఉన్న వ్యక్తులకు చల్లటి నీళ్లు త్రాగడం, చల్లటి నీటితో స్నానం చేయడం మరియు చల్లటి గాలికి గురికావడం లాంటి రూపాల్లో కోల్డ్ థెరపీని సూచిస్తారు.
ఆస్తమా నిర్వహణ కోసం, ఛాతీ మీద చల్లటి నీళ్లు చల్లడంతో పాటు అదేసమయంలో వీపు భాగంలో వేడి ప్యాక్లు ఉంచుతారు. బ్రాంకైటిస్ (వాయుమార్గంలో శోధము)తో బాధపడే వ్యక్తులను ఒక పొడిగా ఉండే షీట్లో చుట్టి ఉంచడం ద్వారా, శరీరానికి చెమట పట్టేలా చేస్తారు.
“రక్తహీనత ఉన్న వారు పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పటికీ, ఆ పోషకాలు గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల కోసం, గ్యాస్ట్రో హెపాటిక్ ప్యాక్ (శరీరం మీద వేడి ఆవిర్లు పంపుతూ, క్రింద వీపు ప్రాంతంలో చల్లటి బ్యాగ్లు ఉంచుతారు)లనేవి శోషణ మెరుగుపరచడంలో సహాయపడతాయి” అని డాక్టర్ సుజాత చెప్పారు.
10 నుండి 15 రోజుల (సుమారు 2 వారాలు) పాటు క్రింది మూడు దశలను నిపుణులు పేర్కొంటారు
తొలగింపు దశ – ఈ దశలో, ఇమ్మర్షన్ థెరపీ అనేది శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగించడంలో సహాయపడుతుంది. ఈ చికిత్సలో రెండు సెషన్లు ఉంటాయి: ఉదయం సెషన్లో వేడి నీటి ఇమ్మర్షన్ ఉంటుంది. సాధారణంగా దీనిని ఖాళీ కడుపుతో చేస్తారు; రెండవ సెషన్ అనేది మూడు నుండి నాలుగు గంటల తర్వాత నిర్వహించడంతో పాటు శరీరానికి విశ్రాంతి అందించడం కోసం వెచ్చటి లేదా చల్లటి నీళ్లు ఉపయోగిస్తారు.
వెచ్చని నీటి ఇమ్మర్షన్ అనే ప్రక్రియను ఇంట్లోని బాత్ టబ్లో కూడా చేయవచ్చు. సేదతీరడానికి మరియు ఒత్తిడి పరిస్థితుల నిర్వహణకు ఇది సహాయం చేస్తుంది. ప్రశాంతమైన ప్రభావం కోసం, బాత్టబ్లో కొన్ని చుక్కల లావెండర్ నూనె వేయవచ్చు.
సూథింగ్ దశ – నీటి అడుగున చేసే మసాజ్ అనేది రక్త ప్రవాహం పెంచుతుంది మరియు రక్తపోటు, మధుమేహం, హైపర్లిపిడెమియా మరియు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులను నిర్వహించడంలో సహాయపడుతుంది. వ్యక్తిని టబ్లో పడుకోబెట్టి, వివిధ దిశల నుండి నీళ్లు ప్రవహించేలా చేయడం ద్వారా, ఉపశమన ప్రభావం అందిస్తారు. సాధారణంగా, ఈ ప్రక్రియలో ఎక్కువ వేడి నీటిని నివారించాలి. ఎందుకంటే, ఈ దశలో ఇది అలసట కలిగిస్తుంది. అందుకే, వెచ్చటి మరియు చల్లటి నీళ్లు మాత్రమే ఉపయోగిస్తారు.
నిర్మాణాత్మక దశ – హైడ్రోథెరపీ మాత్రమే కాకుండా, ఈ దశలో సాధారణంగా క్రోమోథెరపీ (రంగులు ఉపయోగించడం), మసాజ్ మరియు సన్బాత్ లాంటివి సహాయక నిర్వహణ పద్ధతులుగా ఉపయోగపడుతాయి.
ఆహారం
ఈ మొత్తం ప్రయాణంలో, ఆ వ్యక్తిని ఉడికించిన కూరగాయలు మరియు పండ్ల రసాలు మాత్రమే తీసుకోవాలని మరియు ఎక్కువ మసాలాలు వేసిన ఆహారాలు తినకూడదని కోరుతారు.
“ఈ చికిత్స ప్రారంభించే ముందు, శరీరాన్ని రిలాక్స్గా ఉంచాలని మరియు హైడ్రేట్ కావాలని (నీరు త్రాగాలని ) వ్యక్తికి సూచిస్తారు. శరీరంలోని ఏర్పడిన బిగుతుదనం వదిలించుకోవడం కోసం, హైడ్రోథెరపీ తర్వాత వ్యాయామం చేయడం ముఖ్యం. చర్మ అలెర్జీలు లేదా ఇన్ఫెక్షన్తో ఉన్న వ్యక్తులకు హైడ్రోథెరపీ సూచించరు” అని డాక్టర్ పటేల్ చెప్పారు.